- రిజిస్ట్రేషన్ కోసం డబ్బుల తీసుకుంటూ దొరికిన మంథని సబ్ రిజిస్ట్రార్
- భూపాలపల్లిలో పట్టుబడిన కోర్టు స్టెనో, అటెండర్లు
మంథని, వెలుగు : ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన మంథని సబ్రిజిస్ట్రార్ రాజేందర్ను ఏసీబీ ఆఫీసర్లు శుక్రవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం... మంథని మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే రూ. 16,500 ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. దీంతో బాపు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో శుక్రవారం రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లి సబ్ రిజిస్ట్రార్ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్ను కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు రషీద్ను పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో సబ్రిజిస్ట్రార్ రాజేందర్ను సైతం అదుపులోకి తీసుకున్నారు.
భూపాలపల్లిలో కోర్టు స్టెనో, అటెండర్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : కోర్టు సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు లంచం తీసుకున్న స్టెనోగ్రాఫర్తో పాటు ఇద్దరు అటెండర్లను ఏసీబీ ఆఫీసర్లు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... భూపాలపల్లి జిల్లా గణపురం గ్రామానికి చెందిన ఓ రైతుకు కర్కపల్లి శివారులో 14.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిపై మరో రైతు 1984లో కోర్టులో కేసు వేశాడు. భూపాలపల్లి జిల్లా కోర్టుకు చేరిన ఈ కేసులో గతేడాది ఫిర్యాదుదారుడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో కోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ కోసం సదరు రైతు ఈ నెల 10న స్టెనోగ్రాఫర్ సాయిచరణ్ను కలువగా రూ. 20 వేలు డిమాండ్ చేశాడు. ఈ నెల 13న రైతు మరోసారి సాయిచరణ్ను కలువగా.. రూ. 5వేలు ఇస్తేనే సర్టిఫైడ్ కాపీ ఇస్తానని స్పష్టం చేశాడు.
దీంతో రైతు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో శుక్రవారం కోర్టుకు వెళ్లి సాయిచరణ్ను కలువగా.. అటెండర్ రజితకు రూ. 5 వేలు ఇచ్చి సర్టిఫైడ్ కాపీలు తీసుకోవాలని చెప్పాడు. దీంతో రైతు రజితకు డబ్బులు ఇచ్చాడు. తర్వాత ఆ డబ్బులు తీసుకోవాలని తనకు చెప్పాడంటూ మరో అటెండర్ సునీత వచ్చి రజిత నుంచి డబ్బులు తీసుకుంది. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు అటెండర్లు సునీత, రజితతో పాటు సాయిచరణ్ను అదుపులోకి తీసుకున్నారు.
